నేడు జగనన్న విద్యా దీవెన.. నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు
Jagananna Vidya Deevena Scheme 2021 Third Tranche. విద్యార్థులు ఉన్నత చదువులు చదివాలనే లక్ష్యంతో రూపకల్పన చేసిన ‘జగనన్న విద్యా దీవెన’
By Medi Samrat Published on 30 Nov 2021 3:23 AM GMT
విద్యార్థులు ఉన్నత చదువులు చదివాలనే లక్ష్యంతో రూపకల్పన చేసిన 'జగనన్న విద్యా దీవెన' నిధులను నేడు (నవంబర్ 30) సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను నేడు సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే పేద విద్యార్దులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుంది.
ఇందులో భాగంగానే.. జగనన్న విద్యా దీవెన ఈ విద్యా సంవత్సరం మొదటి విడత చెల్లింపులు 19 ఏప్రిల్ 2021 జరగగా.. రెండో విడత 29 జులై 2021 విడుదల చేశారు. మూడవ విడత 30 నవంబర్ 2021(నేడు) విడుదల చేస్తుండగా.. నాలుగవ విడత ఫిబ్రవరి 2022లో జమచేయనున్నారు. విద్యారంగంలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన వ్యయం రూ. 34,622.17 కోట్లు కాగా.. మొత్తం లబ్దిదారులు – 1,99,38,694. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,778 కోట్లు బకాయిలతో కలిపి ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.6,259 కోట్లు.