చంద్రబాబుపై మంత్రుల కామెంట్స్.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్..
AP Ministers Comments On Chandrababu. చంద్రబాబు పతనం ఎప్పుడో ప్రారంభమైందని రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
By Medi Samrat Published on 17 Nov 2021 9:45 AM GMT
చంద్రబాబు పతనం ఎప్పుడో ప్రారంభమైందని రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పతనం ఎప్పుడో ప్రారంభమైందని.. ఇప్పుడు క్లైమాక్స్ కి వచ్చిందని అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదని అందరికీ తెలుసునని.. ఆయన కంచుకోటగా భావించే కుప్పంలో కూడా లేదని ఇప్పుడు మళ్లీ తేలిపోయిందని వెల్లంపల్లి అన్నారు. చంద్రబాబు స్వీయ తప్పిదాలే టీడీపీ పతనానికి కారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.
చంద్రబాబు అమరావతి ఒక్కటే తన ఎజెండా అనుకున్నారని.. అందుకే మిగతా ప్రాంతాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఇప్పుడైనా వాస్తవ పరిస్థితులను చంద్రబాబు గమనించాలని.. కుప్పం ప్రజలు వాస్తవాలను గుర్తించారు కాబట్టే చంద్రబాబును పక్కన పెట్టారని కామెంట్ చేశారు. చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్ చేయటమే తెలుసని.. ప్రజల ప్రేమను, అభిమానాన్ని ఎలా పొందాలో తెలియదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రతిసారీ చంద్రబాబు కుయుక్తులు పనిచేయవని.. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తున్నాయని అన్నారు.