దేశంలో 2వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
By Newsmeter.Network Published on 2 April 2020 9:41 AM ISTప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత్లోనూ వేగంగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి ప్రజలను ఇండ్లకే పరిమితం చేశారు. దీని ద్వారా కాంటాక్ట్ కేసులు నమోదు కాకుండా, వైరస్ వ్యాప్తి కాకుండా నిరోదించేలా చర్యలు చేపట్టారు. కానీ పలువురి అత్యుత్సాహం వల్ల రోజురోజుకు కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఫలితంగా దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2వేలకు చేరువలో ఉంది. ప్రస్తుతం 1834 మంది ఈ కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా సమాచారం వెల్లడించింది. 1649 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 143 మంది వైద్య చికిత్సల అనంతరం డిశ్చార్చి అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 47కు చేరింది. వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు చూస్తే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 2వేల మార్క్ ను దాటినట్లు తెలుస్తోంది.
Also Read :నిద్రపోయాడు.. లేచి చూసేసరికి అద్భుతం.. అలాఎలా జరిగింది?
కాగా గడిచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా దాదాపు 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీటిల్లో 95శాతం కేసులు ఢిల్లిలో తుబ్లిగ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల వారు ఉన్నారు. ఇదిలా ఉంటే దేశంలో వైరస్ కేసులకు 10 ప్రాంతాలు హాట్ స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది. ఎక్కువ కేసులు ఆ రాష్ట్రాల్లోని ప్రాంతాల్లోనే నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. రెండు రాష్ట్రాల్లో అదుపులో ఉందనుకొని భావిస్తున్న తరుణంలో ఢిల్లిలో తబ్లిగ్ జమాత్ సంస్థ నిర్వహించిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఈ రెండు రాష్ట్రాల్లో అధికంగా ఉండటంతో అమాంతం పాజిటివ్ కేసులు అధికమయ్యాయి. దీంతో తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 30 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 127కు చేరింది. ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కు చేరింది.
Also Read :తెలంగాణలో తొమ్మిదికి చేరిన కరోనా మరణాలు..