తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 29లోపు ఏపీలో ఐదుగురు, తెలంగాణకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.
తెలంగాణలో ఎమ్మెల్సీలు మహముద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం, బేరి సుభాష్ రెడ్డి, ఎంఐఎం నుంచి రియాజుల్ హుస్సెన్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. దీంతో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 05, తెలంగాణలో 05 ఖాళీలు ఉన్నాయి. ఏపీలో జంగా కృష్ణామూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, రామారావుల పదవీ ముగియనుంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఒకే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. 11వ తేదీన స్క్రుటినీ ఉంటుంది. మార్చి 13వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువునిచ్చారు. ఇక మార్చి 20 వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ చేపడతారు. మార్చి 24వ తేదీలోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.