కర్నూలు మాజీ ఎంపీ, వైసీపీ నేత బుట్టా రేణుక కుటుంబానికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) భారీ షాక్ ఇచ్చింది. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో, వడ్డీతో కలిపి సుమారు రూ. 782.07 కోట్ల బకాయిల వసూలు కోసం వారి ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని కేపీహెచ్బీ (KPHB) ఫేజ్-6లో ఉన్న మెరిడియన్ స్కూల్ భవనం సహా 3,833 గజాల స్థలాన్ని వేలం జాబితాలో చేర్చింది. ఈ ఆస్తికి రూ. 65 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించిన అధికారులు, మార్చి 24న ఈ-వేలం నిర్వహించనున్నారు.
గతంలోనే రికవరీ నోటీసులు అందుకున్న బుట్టా కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, బకాయిలు చెల్లించడంలో వైఫల్యం చెందడంతో ఇప్పుడు వేలం ప్రక్రియ వేగవంతమైంది. విద్య, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో విస్తరించిన బుట్టా గ్రూప్, ఇటీవలి కాలంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. బుట్టా రేణుక 2014లో కర్నూలు ఎంపీగా గెలిచి, ఆ తర్వాత రాజకీయ సమీకరణాల వల్ల వివిధ పార్టీల్లో కొనసాగి, ప్రస్తుతం వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే.