ప్రజలకు అలర్ట్
By - Nellutla Kavitha |
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర వడగాలులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖతోపాటుగా, ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ప్రజలను అలర్ట్ చేసింది. తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కనీసం గరిష్టంగా రెండునుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావద్దని సూచించింది. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, అదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాగల మూడు రోజులపాటు తెలంగాణవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్ చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 17 మండలాల్లో వడగాల్పులు వీచాయని, రానున్న 24 గంటల్లో డెబ్భై నాలుగు మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక రాబోయే 48 గంటల్లో 57 మండలాల్లో వేడిగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు