బీజేపీ అంటేనే మోసం, జుమ్లా, జూటా - హరీష్ రావు

Telangana Min Harish Rao Criticises BJP Over Their Non-fulfilling Promises In Elections

By -  Nellutla Kavitha |  Published on  16 Oct 2022 7:08 AM GMT
బీజేపీ అంటేనే మోసం, జుమ్లా, జూటా - హరీష్ రావు

నల్లగొండ పోరాటాల గడ్డ అని, అక్కడ బీజేపీ ఆటలు సాగవని అన్నారు మంత్రి హరీష్ రావు. మునుగోడులో బీజేపీ అబద్దాలతో గెలవాలనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుందని, ప్రధాని రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదని, ప్రధాని మోదీ రైతులకు క్షమాపణ చెప్పి ఏడాది గడుస్తున్నా రైతులకు చేసిందేమీ లేదన్నారు హరీష్.

ప్రధాని హామీల అమలు కావడం లేదు కానీ బీజేపీ నేతలు మాత్రం మునుగోడులో గోబెల్స్ లా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. దుబ్బాక, హుజురాబాద్, GHMC ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలకు అంతే లేదని, ఆ హామీల్లో ఒక్కటైనా అమలైందా అని ఆయన ప్రశ్నించారు. 3 వేల పెన్షన్ అని దుబ్బాక లో, హుజూరా బాద్ లో అన్నారని, ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. మళ్లీ ఇపుడు మునుగోడులో 3 వేలు ఇస్తామని అంటున్నారని, బీజేపీ వాళ్ళది నోరా మోరా? అని ఆయన ప్రెసిడెంట్ మీట్ లో మాట్లాడారు. దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 3 వేల పెన్షన్ ఇచ్చి ఇక్కడ మాట్లాడాలని ఆయన సవాల్ చేసారు.

బీజేపీ అంటేనే మోసం, జుమ్లా, జూటా పార్టీ అని, బీజేపీ కి భయం లేదు, భక్తి లేదు, భాద్యత లేదని ఆయన అన్నారు. ఎన్నికలయ్యాక గొంగడి మాది కాదు చెప్పులు మావి కావు అనే బాపతు పార్టీ బీజేపీ అని హరీష్ రావు అన్నారు. ఇపుడు రాజగోపాల్ రెడ్డి 3 వేల పెన్షన్ అని మళ్లీ మోసం చేస్తున్నాడని, వీళ్ళు చెప్పే మాటలు ప్రధాని మోడీతో చెప్పించాలని, నల్లగొండ పోరాటాల ఖిల్లా, బీజేపీ మోసాలను అక్కడ నమ్మరని అన్నారు హరీష్ రావు.

బీజేపీ పాలనలో ప్రజల ఆకలి పెంచారని, గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో మన స్థానం 107 కి దిగజారిందని, ఇందుకేనా బీజేపీకి మునుగోడులో ఓటు వేయాలి ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ కన్నా దేశం లో అద్వాన్నంగా పరిస్థితులు దిగజారాయని ఆయన ఎద్దేవా చేసారు. దుబ్బాక, హుజురాబాద్ లో బీజేపీ కేంద్ర మంత్రులు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారని, అవన్నీ అమలు అయ్యాయా అని ఆయన ప్రశ్నించారు.

Next Story