టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం ఉద‌యం టీటీటీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌ర‌గింది.

By Medi Samrat
Published on : 20 May 2025 8:42 PM IST

టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం ఉద‌యం టీటీటీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌ర‌గింది. టీటీడీ చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన స‌మావేశంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. టీటీడీలో ప‌ని చేస్తున్న అన్య‌మ‌త‌స్తులను బ‌దిలీ చేసేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు, స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణకు చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆమోదం లభించింది. టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. వీఆర్ఎస్‌కు అంగీకరిస్తే రిటైర్డ్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు.

⁠రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్నిఅట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ ఆమోదం వ‌చ్చాక ద‌శ‌ల‌వారీగా 2025-26 సంవ‌త్స‌రంలో రూ.1.74కోట్లు, 2026-27 సంవ‌త్స‌రంలో రూ.1.13కోట్లు, 2027-28 సంవ‌త్స‌రానికి రూ.1.13కోట్లు ప్ర‌భుత్వ అట‌వీశాఖ‌కు విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యం. తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, అమ‌రావ‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నారాయ‌ణ‌వ‌నం క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, క‌పిల‌తీర్థం క‌పిలేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నాగాలాపురం వేద‌నారాయ‌ణ‌స్వామి ఆల‌యం, ఒంటిమిట్ట కోదండ‌రామ స్వామి ఆల‌యాల అభివృద్ధి కోసం స‌మ‌గ్ర బృహ‌త్ ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక‌, ఆర్థిక ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యం.

తిరుమ‌ల‌లోని విశ్రాంత భ‌వ‌నాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్ద‌రు దాత‌లు స్పందించ‌కపోవడంతో ఈ విశ్రాంతి గృహాల పేర్ల‌ను టీటీడీనే మార్పు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనుంది. తిరుమ‌ల‌లోని బిగ్ క్యాంటీన్లు, జ‌న‌తా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణ‌యించే అంశంపై ఆమోదం. భ‌క్తులకు నాణ్య‌మైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం. ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం ప్రాంతాల‌ను భ‌క్తులు విశేష సంఖ్య‌లో సంద‌ర్శిస్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డ‌ ఆధ్యాత్మిక, ప‌ర్యావ‌ర‌ణ‌, మౌలిక స‌దుపాయాలను మ‌రింత పెంచేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని నిర్ణ‌యం.

రాయ‌ల‌సీమ‌కే త‌ల‌మానికంగా ఉంటూ ఎంద‌రో పేద ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్న స్విమ్స్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రికి ఆర్థిక స‌హాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న రూ.60కోట్ల‌తో పాటు అద‌నంగా మ‌రో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదం. స్విమ్స్ మ‌రింత మెరుగైన వైద్య సేవ‌లు అందించేంద‌కు ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న డాక్ట‌ర్లు, న‌ర్సులు, పారా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం చేప‌ట్టేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.⁠ ⁠తిరుమ‌ల ఆల‌య భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాల‌జీ వాడాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు

Next Story