తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో పాము కలకలం రేపింది. నిత్యం జనసందోహం ఉండే ఆలయ ప్రాంగణంలో పాము కనబడడంతో భక్తులు పరుగులు తీశారు. అక్కడే ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది పాముపై ఓ ప్లాస్టిక్ డబ్బాను ఉంచారు. అందులో నుంచి పాము బయలకు రాకుండా ఉండేందుకు డబ్బాపై ఓ రాయిని ఉంచారు. అనంతరం పాములను పట్టేవారిని పిలిపించారు. వారు వచ్చి చాకచక్యంగా పామును పట్టుకుని ఓ సంచిలో వేసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
భక్తుల ఆందోళన..
తిరుమల గరుడ కూడలిలో భక్తులు ఆందోళనకు దిగారు. సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గరుడ కూడలిలో బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సారి పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తుండగా.. ఈ నెల 24 వరకూ సర్వదర్శన టోకెన్లు జారీ చేసి మూడు రోజులు ముందుగానే టోకెన్లు ఇచ్చే కేంద్రాలను టీటీడీ మూసివేసింది. ముందస్తు ప్రకటన లేకుండా సర్వదర్శన టోకెన్లను జారీ చేయడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. వందలాది కిలోమీటర్లు పాదయాత్రగా దూరప్రాంతాల నుంచి వచ్చిన తాము శ్రీవారిని దర్శించుకోకుండానే వెనుదిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.