Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.

By Medi Samrat
Published on : 28 Dec 2024 11:37 AM IST

Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో స్వామివారి సర్వదర్శనం అవుతోంది. శుక్రవారం నాడు 66,715, మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా 24,503 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.06 కోట్లు ఆదాయం వచ్చింది.

తిరుమల శ్రీవారి అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబరు 30 నుంచి 2025 జ‌న‌వ‌రి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు. తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

Next Story