తిరుమల నడక మార్గంలో మరో చిరుత ఉన్నట్లు తెలుస్తోంది.  మరో చిరుత బుధవారం సంచరిస్తున్నట్లు కెమెరాల్లో సిబ్బంది గుర్తించారు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారాన్ని గుర్తించారు. దీంతో తిరుమల కాలినడక దారి భక్తులను టీటీడీ అలెర్ట్ చేసింది. గత కొన్ని నెలల్లో ఐదు చిరుతల్ని టీటీడీ అధికారులు బంధించారు. చిరుతల సంచారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వాటిని కట్టడి చేయడంపై టీటీడీ దృష్టి సారించింది. చిరుతల సంచరాన్ని నిరోధించేందుకు  టీటీడీ చర్యలు చేపట్టింది.  తిరుమల కాలినడక మార్గంలో చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కుకునే ప్రాంతాలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
శ్రీవారి  నడకదారిలో చిరుత పులుల దాడుల నేపథ్యంలో భక్తులను టీటీడీ అధికారులు అలర్ట్ చేశారు.  తిరుమల కాలిబాట మార్గంలో చిరుత దాడిలో అక్షిత అనే బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి  తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు కర్రలు ఇచ్చి పంపుతున్నారు.  వాటిని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తిరిగి తీసుకొని వాటినే రొటేషన్ పద్దతిలో ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు.  శ్రీశైలం ఫారెస్ట్ నుంచి 8 వేల 500 కర్రలు తీసుకొచ్చామని టీటీడీ  చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు.