తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడంటే.!

When is the school reopening in Telangana. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది.

By అంజి  Published on  29 Jan 2022 5:46 AM GMT
తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడంటే.!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది. జనవరి 8వ తేదీన స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తర్వాత సెలవులను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగింది. ఈ క్రమంలోనే విద్య దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో.. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తోంది. అయితే స్కూళ్లకు ప్రకటించిన సెలవులు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. కాగా ఫిబ్రవరి మొదటి తేదీ నుండి స్కూళ్లు పునఃప్రారంభం చేసే ఛాన్స్‌ కనిపిస్తోంది. స్కూళ్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్కూళ్ల పునఃప్రారంభం ఎప్పుడనేదానిపై నేడు రాష్ట్ర సర్కార్‌ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పాఠ‌శాల‌లపై ప్రారంభంపై వివ‌రాలు తెల‌పాల‌ని, ఈ నెల 31 నుంచి పాఠ‌శాలలు తెరుస్తారా..? అని హైకోర్టు ఆరా తీసింది. విద్యా సంస్థ‌ల ప్రారంభంపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని ప్ర‌భుత్వం త‌రుపు న్యాయ‌వాది న్యాయ‌స్థానానికి విన్న‌వించారు. వారాంత‌పు సంత‌ల్లో క‌రోనా నియంత్ర‌ణ ప్ర‌భుత్వం ఎటువంటి చేప‌ట్టారో తెల‌పాల‌ని, స‌మ్మ‌క్క జాత‌ర ఏర్పాట్ల‌పై నివేద‌క‌ను స‌మ‌ర్పించాల‌ని హైకోర్టు ఆదేశించింది. అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను ఫిబ్ర‌వ‌రి 3కి వాయిదా వేసింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉంది. అయితే కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాష్ట్రంలో కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే స్కూళ్ల ప్రారంభానికి రాష్ట్ర సర్కార్‌ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫిబ్రవరి మొదటి తేదీ నుండి స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఇప్పటికే స్కూళ్లు పునఃప్రారంభం అయ్యాయి.

Next Story