కొండా దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతల తిరుగుబాటు..రాష్ట్ర ఇన్చార్జ్కి ఫిర్యాదు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న కొండా దంపతులు మరోసారి హాట్ టాపిక్గా మారారు.
By Knakam Karthik
కొండా దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతల తిరుగుబాటు..రాష్ట్ర ఇన్చార్జ్కి ఫిర్యాదు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న కొండా దంపతులు మరోసారి హాట్ టాపిక్గా మారారు. మొన్నటిదాకా మంత్రి కొండా సురేఖ మాత్రమే.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనుకుంటే.. ఇప్పుడు ఆవిడకు తోడుగా.. ఆమె భర్త కొండా మురళి కూడా తయారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు లేవదీశారు. ఆదివారం తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ను వరంగల్ జిల్లా కీలక నేతలు కలిసి మంత్రిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇన్చార్జ్ మీనాక్షీతో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కార్పొరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నేత ఎర్రబెల్లి స్వర్ణ కలిశారు.
వివాదమేంటి?
మంత్రి సురేఖ సర్కారును ఇరుకున పడేసేలా మాట్లాడితే.. కొండా మురళి వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను ఇరకాటంలో పడేసేలా మాట్లాడుతున్నారు. నాలుగురోజుల క్రితం మంత్రి భర్త కొండా మురళి మాట్లాడుతూ..కడియం శ్రీహరి, రేవూరి తదితరులపై తీవ్రమైన ఆరోపణలు చేయటమే కాకుండా వ్యక్తిగతంగా కూడా దూషించారు. దాంతో మరుసటిరోజే నాయిని ఆధ్వర్యంలో కడియం తదితర నేతలంతా సమావేశమై మంత్రితో పాటు మురళిపైన విరుచుకుపడ్డారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు.. వరంగల్ బోర్డర్ దాటి స్టేట్ మొత్తం హాట్ టాపిక్గా మారాయి. దీనిని.. ఆ జిల్లా నేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
మీనాక్షి భరోసా
కొండా మురళి వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న వరంగల్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షిని కలిసి కంప్లయింట్ చేశారు. వ్యతిరేక వర్గం నేతలు మీనాక్షితో జరిగిన భేటీలో మంత్రి దంపతులపై ఆరోపణలు చేయటమే కాకుండా కాకుండా తమపై మంత్రి భర్త మురళి చేసిన ఆరోపణలు, వ్యాఖ్యల మీడియా క్లిప్పింగులను ఆధారాలుగా చూపించినట్లు తెలిసింది. మీడియా క్లిప్పింగులను పరిశీలించిన తర్వాత వరంగల్ పంచాయితీపై తాను విచారణ చేయిస్తానని, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల సమాచారం. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ వ్యతిరేక నేతలకు మీనాక్షి భరోసా ఇచ్చినట్లు సమాచారం.