SRHపై HCA వేధింపులు..ప్రభుత్వానికి విజిలెన్స్ సంచలన నివేదిక
ఐపీఎల్ టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్ఆర్హెచ్ ప్రాంఛైజీపై ఒత్తిడి తీసుకువచ్చిన వ్యవహారంపై విజిలెన్స్ విచారణ పూర్తయింది
By Knakam Karthik
SRHపై HCA వేధింపులు..ప్రభుత్వానికి విజిలెన్స్ సంచలన నివేదిక
ఐపీఎల్ టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్ఆర్హెచ్ ప్రాంఛైజీపై ఒత్తిడి తీసుకువచ్చిన వ్యవహారంపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఈ క్రమంలోనే హెచ్సీఏ అక్రమాలపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కాగా విచారణ పూర్తిచేసిన విజిలెన్స్ అధికారులు తమ నివేదికను సీఎంకు అందజేశారు. HCA ఐపీఎల్ 2025 టికెట్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
పది శాతం టికెట్లను ఉచితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఉచితంగా ఇస్తున్నా.. మరో 10 శాతం టికెట్లు కావాలని హెచ్సీఏ సెక్రటరీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారని విచారణలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పది శాతం టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తేల్చిచెప్పింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ డిమాండ్ చేశారని విజిలెన్స్ అధికారులు ఐడెంటిఫై చేశారు. అయితే హెచ్సీఏ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటే టికెట్లు ఇచ్చేందుకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అంగీకరించింది. కానీ తనకు వ్యక్తిగతంగా 10 శాతం టికెట్లు కావాలని జగన్మోహన్ డిమాండ్ చేశారని విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో తెలిపారు. వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వకపోవడంతోనే మ్యాచ్ల సందర్భంగా జగన్మోహన్ ఇబ్బందులకు గురి చేశారని గుర్తించింది. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్సీఏ సిబ్బంది తాళాలు వేసింది. కాగా ఎస్ఆర్హెచ్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు విజిలెన్స్ నివేదికలో నిర్ధారణ అయింది. దీంతో హెచ్సీఏపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది.
ఈ వ్యవహారంపైనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కోటకోట శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అందులో హెచ్సీఏ అక్రమాలు, టికెట్ల దుర్వినియోగం, అధిక ధరలకు విక్రయించడం వంటి విషయాలు ధృవీకరించారు. కాగా ఏప్రిల్ 2న హెచ్సీఏ, సన్ రైజర్స్ మధ్య చర్చలు జరిగి, 3,900 టికెట్ల ఒప్పందాన్ని కొనసాగించడానికి రెండు పక్షాలు అంగీకరించాయి. హెచ్సీఏ ఇకపై ఒత్తిడి చేయదని హామీ ఇచ్చింది.