బీఆర్‌ఎస్‌ పేరు మార్చడంపై.. అభ్యంతరాలు కోరిన టీఆర్‌ఎస్

TRS seeks objections on move to become BRS. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చాలన్న నిర్ణయంపై

By అంజి  Published on  7 Nov 2022 12:03 PM GMT
బీఆర్‌ఎస్‌ పేరు మార్చడంపై.. అభ్యంతరాలు కోరిన టీఆర్‌ఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చాలన్న నిర్ణయంపై.. ఆ పార్టీ అభ్యంతరాలు కోరింది. పేరు మార్పు నిర్ణయం తీసుకున్న నెల రోజుల తర్వాత తెలంగాణ అధికార పార్టీ దీనికి సంబంధించి బహిరంగ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడి పేరుతో జారీ చేయబడిన ఈ నోటీసులో.. టిఆర్ఎస్ తన పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకోవాలని ప్రతిపాదిస్తున్నట్లు ప్రజలకు తెలియజేస్తుంది. "ప్రతిపాదిత కొత్త పేరుపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే, వారు తమ అభ్యంతరాన్ని 30 రోజులలోగా సెక్రటరీ (రాజకీయ పార్టీ), భారత ఎన్నికల సంఘం, నిర్వాచన్ సదన్, అశోకా రోడ్, న్యూఢిల్లీ, 110001కు పంపవచ్చు." అని నోటీసులో ఉంది.

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించిన మరుసటి రోజే నోటీసులు జారీ చేసింది. పేరు మార్పు నిర్ణయం తర్వాత ఆ పార్టీకి ఇది మొదటి ఎన్నికల విజయం. బీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా గుర్తించాలన్న పార్టీ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడంలో భారత ఎన్నికల సంఘం జాప్యం చేయడంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆదివారం మాట్లాడారు. అక్టోబర్ 5న పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ విస్తృత సాధారణ బాడీ సమావేశం దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించడానికి పార్టీ పేరును బిఆర్ఎస్‌గా మార్చాలని తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరించారు.

మరుసటి రోజు టీఆర్ఎస్ తన పేరును మార్చాలనే నిర్ణయాన్ని భారత ఎన్నికల సంఘానికి తెలియజేసింది. మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌ నేతృత్వంలోని పార్టీ నేతల బృందం న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులతో సమావేశమై టీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం కాపీని అందజేసింది. అభ్యంతరాలుంటే పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు ప్రతినిధి బృందానికి తెలిపారు. 2001లో తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను తెరపైకి తెచ్చారు. 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో 2014లో లక్ష్యాన్ని సాధించి, కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత 2018లో కూడా అధికారాన్ని నిలబెట్టుకున్నారు.

Next Story