ఆ రెండు పార్టీలు వేరు వేరు కాదు.. ఒకటే..
TPCC Working President Mahesh Kumar Goud Fire On BJP and BRS. ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో మూడు హత్యలు, ఆరు ఆత్మ హత్యలు జరుగుతున్నాయని
By Medi Samrat Published on 27 Dec 2022 3:07 PM IST
ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో మూడు హత్యలు, ఆరు ఆత్మ హత్యలు జరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ధరణిలోని లోపాల వల్లనే రాష్ట్రంలో అల్లకల్లోలం ఏర్పడుతోందని.. భూ తగాదాలతో హత్యలు , ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దండగ.. ప్రయోజనం లేని ప్రాజెక్టు అని అన్నారు. ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే రూ. 40 వేలు విద్యుత్ బిల్లు అవుతుందని అధికారులు చెబుతున్నారని.. అలాంటి ప్రాజెక్టు ను ఎందుకు కట్టారని ప్రశ్నించారు.
ధరణి ఇతర అంశాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నాయకుడు భట్టి లతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వినతి పత్రం ఇచ్చామని.. ఇంతవరకు దానిపై ఏమి చర్య లేదని.. కొందరు ప్రభుత్వ అధికారులు కేసీఆర్ కి తొత్తులుగా పని చేస్తూన్నారని ఫైర్ అయ్యారు. రేపు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గాంధీ భవన్ లో ఉంటుందని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో, లిక్కర్ కుంభకోణంలో కూడా నిస్పక్షపాతగంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బిఆర్ఎస్ విషయములో ఇప్పటికీ అనుమానం ఉందని అన్నారు. ఆ రెండు పార్టీలు వేరు వేరు కాదని.. రెండు ఒకటే అన్నది మా ఆరోపణ అని అన్నారు. ఎన్నికల వరకు ఆ రెండు పార్టీలు హైప్ సృష్టిస్తారని అన్నారు. సునీల్ కనుగోలు పరారీలో ఉండాల్సిన కేసు కాదని.. మా కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేసి.. పార్టీ వ్యయాలకు చెందిన సమాచారాన్ని తీసుకెళ్లారని తెలిపారు.