ఆ అనుబంధంతోనే కేసీఆర్‌ కమ్యూనిస్టులను వ‌దిలేశారు : రేవంత్ రెడ్డి

మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్ బుధ‌వారం కాంగ్రెస్‌లో చేరారు. పెద్ద ఎత్తున అనుచ‌ర‌గ‌ణంతో

By Medi Samrat  Published on  23 Aug 2023 1:24 PM GMT
ఆ అనుబంధంతోనే కేసీఆర్‌ కమ్యూనిస్టులను వ‌దిలేశారు : రేవంత్ రెడ్డి

మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్ బుధ‌వారం కాంగ్రెస్‌లో చేరారు. పెద్ద ఎత్తున అనుచ‌ర‌గ‌ణంతో గాంధీభ‌వ‌న్ చేరుకున్న ఆయ‌న‌.. రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పార్టీ కండువా క‌ప్పి ఆయ‌న‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని అన్నారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామ‌ని తెలిపారు. తొమ్మిదేళ్ల బీఆరెస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారిందని ఆరోపించారు.

దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు. అవును.. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. వైన్ షాపుల టెండర్ల పేరుతో రూ. 2500 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే.. కేసీఆర్ రూ.7500 కోట్లకు తెగమ్ముకున్నారని ఆరోపించారు.

సాగునీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్.. కాంగ్రెస్ ఏం చేసిందో..నాగార్జున సాగర్ కట్టమీద చర్చిద్దామా? అని స‌వాల్ విసిరారు. చరిత్ర తిరగేసి చూడు కాంగ్రెస్ ఏం చేసిందో తెలుస్తద‌ని అన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు దిగమింగాడు.. కామారెడ్డిలో 22వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు.. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించామని అన్నారు. కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్న.. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగొద్దు.. డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిన చోట మేం ఓట్లు అడగం అని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారని అన్నారు. కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకుని వదిలేశారని.. బీజేపీతో ఉన్న అనుబంధంతోనే కమ్యూనిస్టులను కేసీఆర్ వదిలేశారని ఆరోపించారు. అందుకే ఏకపక్షంగా టికెట్లు కేటాయించుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే.. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేన‌న్నారు.

బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం మూడు పార్టీలను ఓడించండి.. కాంగ్రెస్ ను గెలిపించండని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామ‌న్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామ‌ని తెలిపారు. రూ.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామ‌న్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల సాయం అందిస్తామ‌న్నారు. 26న చేవెళ్లలో జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Next Story