సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పాల్సిన సమయం వచ్చింది

TPCC President Revanth Reddy Fire On CM KCR. అమెరికా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం డల్లాస్ నగరంలో

By Medi Samrat  Published on  3 Jun 2022 10:54 AM GMT
సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పాల్సిన సమయం వచ్చింది

అమెరికా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం డల్లాస్ నగరంలో జరిగిన తెలంగాణ అవిర్భావ సభలో ప్రవాస తెలంగాణ వాసులనుద్దేశించి ప్రసగించారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. సోనియా గాంధీ ఆ రోజు అనుకోకుంటే 100 సంవత్సరాలు అయినా.. లక్ష మంది కేసీఆర్ లు చచ్చినా తెలంగాణ అనేది కలగానే మిగిలిపోయేదని అన్నారు. తరతరాలుగా తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటాన్ని, ప్రజల ఆక్షాంకలను సోనియా గాంధీ గుర్తించారు. తెలంగాణలో పర్యటించినప్పుడు ఇక్కడి ప్రజల కోరికను గౌరవిస్తామని మాట ఇచ్చారు. రాజకీయంగా ఒడిదుడుకులు ఎదురవుతున్నా, ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా సమాధి అవుతామని తెలిసినా, లాబీయింగ్ చేస్తున్నా సీమాంధ్ర ప్రాంత నాయకుల ముందు తెలంగాణ ప్రజలు ఓడిపోవద్దని సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ వచ్చి ఎనిమిదేళ్లు అయింది. వెనక్కి తిరుగు చూసుకుంటే ఎందుకరా తెలంగాణ వచ్చింది అనే పరిస్థితులు దాపురించాయని విమ‌ర్శించారు. ఈ పరిస్థితిని చూసుకుంటూ కూర్చుందామా? నాకు పదవులు, పైసలు కావాలంటే ఏ పార్టీ అయినా ఇస్తుంది. తరతరాలు కూర్చోని తిన్న తరగని సంపదను పోగు చేసుకోవచ్చు. అయిన లోంగకుండా ప్రజల తరపున పోరాటం సాగిస్తున్నా.. ప్రజస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి అధికార పక్షానికి లోంగిపోయి చరిత్ర హీనుడిగా మిగిలిపోదల్చుకోలేదని వ్యాఖ్యానించారు. 120 కేసులు పెట్టి జైళ్లలో వేసినప్పటికీ.. తెలంగాణ ప్రజల మీద మాకు ఉన్న బాధ్యతతో అధికార పక్షానికి లోంగకుండా నిలబడి కోట్లాడుతున్నాన‌ని అన్నారు.

అప్పట్లో జైళ్లో చిప్పుకూడు తిన్నవు అని ఏవరో వ్యాఖ్యానించారు. ఆ చిప్పకూడు తిన్న తర్వాతే నాలో గుండె ధైర్యం పెరిగింది. చర్లపల్లి జైళ్లో తిన్న చిప్ప కూడు మీద ఒట్టేసి చెబుతున్న కేసీఆర్ ను పాతళానికి తొక్కే బాధ్యత నేను తీసుకుంటా.. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పోలిమేరల దాకా తరిమే వరకు పోరాటం సాగిస్తాన‌ని.. ఆ పోరాటంలో ప్రాణాలు పోయిన ఫర్వాలేదని రేవంత్ అన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే వరకు విశ్రమించకుండా పోరాటం చేస్తూనే ఉంటానని తెలిపారు.

2006లో మొదటి సారి ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా ఎన్నికయ్యాను. 2007లో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, 2009, 2014లలో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచాను, ఎవరూ అధికారంలో ఉన్నా వారికి లోంగకుండా ప్రజల పక్షాన నిలబడి కోట్లడినట్లు గుర్తుచేశారు. ఈ పోరాటాన్ని చూసే సోనియా గాంధీ నన్ను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. గురతర బాధ్యతను అప్పగించారు. 2023 జూన్ లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేసే బాధ్యతను నేను తీసుకుంటాన‌ని అన్నారు. తెలంగాణ తెచ్చిన అని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండు సార్లు అధికారం ఇచ్చారు. తెలంగాణ ప్రజల్లో నరనరాన కృతజ్ఞత భావం ఉంది. మరీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పాల్సిన సమయం.. వచ్చిందా లేదా మీరే ఆలోచన చేయండని అన్నారు.

అమెరికా ప్రబల శక్తిగా ఎదగడంలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో ఉంది. రాబోయే 20 ఏళ్లలో అమెరికాను శాసించే స్థాయికి మీరు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్రం డిమాండ్ ను రాజకీయ పార్టీలు లేవనెత్తడానికి ముందే మీరు ఇక్కడ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ అనే సంస్థను స్థాపించి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఏ లక్ష్యాల కోసం అమరులు తమ ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణ సాధించారో.. నేడు ఆ ఉద్దేశాలు తెలంగాణలో నేరవేరయా లేదో సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ స్వార్ధానికి బలైపోతుంది. కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవించడానికి, వారి బంధువులకు రాష్ట్ర సంపాదనను దోచిపెట్టడానికేనా తెలంగాణ వచ్చిందా? అని ప్ర‌శ్నించారు. నేడు తెలంగాణలో రైతులు కల్లాల్లోనే గుండె ఆగి మరణిస్తున్న దౌర్భగ్య స్థితి వచ్చిందని అన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు అలస్యమవుతున్నాయనే మనో వేదనతో ఎంతో మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండేది. 60 ఏళ్లు కష్టపడి అభివృద్ధి చేసి ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్ది కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అప్పగించింది. ఇటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దివాళా తీయించింది. కేసీఆర్ నిర్వాకంతో ప్రభుత్వ బాండ్లను వేలం వేసి వచ్చిన డబ్బుతో నెల నెలా జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించిందని విమ‌ర్శించారు. 20వ తేదీ వచ్చిన జీతాలు చెల్లించరని.. ఆసరా ఫించన్లు మూడు నెలలు ఆలస్యంగా ఇస్తున్నారని మండిప‌డ్డారు.

ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ నేడు నయా నిజాం చేతిలో బంధి అయిందని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీనికి కారణమైన వ్యక్తుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. అందుకు మీ సహకారం కావాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం చారిత్రాక అవసరమ‌ని నొక్కి చెప్పారు. ఇందుకోసం మీ గ్రామాల్లో, మండలాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయండని కోరారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే మహాయజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.



























Next Story