ముందస్తు ఒప్పందంలో భాగంగానే కేసీఆర్‌కు ఢీల్లీలో స్థలమిచ్చారు

TPCC President Revanth Reddy Fire On BJP. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  3 Oct 2022 10:43 AM GMT
ముందస్తు ఒప్పందంలో భాగంగానే కేసీఆర్‌కు ఢీల్లీలో స్థలమిచ్చారు

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈడీ అధికారులతో కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందని.. ముఖ్య నాయకులను ఈడీ కేసులతో భయపెట్టి వారిని బీజేపీ లోకి చేర్చుకోవాలని చూస్తోందని విమ‌ర్శించారు. రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందనే.. గతంలో మూసేసిన హెరాల్డ్ కేసును మళ్లీ తెరిచారని అన్నారు. హెరాల్డ్ కేసులో ఎలాంటి తప్పిదాలు జరగలేదని గతంలోనే కేసును మూసేశారని.. రాహుల్ పాదయాత్రను అడ్డుకునేందుకే కేసును మళ్లీ తెరిచారని.. అందుకే ఈడీ అధికారులను ఉసిగొలిపి రాహుల్ గాంధీని విచారణకు పిలిచారని ఆరోపించారు.

సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా.. ఆమెను విచారణకు పిలిచి వేధింపులకు పాల్పడ్డారు.. అయినా భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు నోటీసులు ఇస్తున్నారని ఫైర‌య్యారు. కర్ణాటకలో యాత్రను అడ్డుకునేందుకు శివకుమార్ కు ఈడీ విచారణకు పిలిచింది.ఏయే రాష్ట్రాల్లో పాదయాత్ర ఉందో.. అక్కడి నేతలకు ఈడీ నోటీసులిస్తోందని విమ‌ర్శించారు. ఈడీ అంటే బీజేపీ తన ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా మార్చుకుందని కామెంట్ చేశారు.

గీతారెడ్డి, షబ్బీర్ అలీ,సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి క్రియాశీల నాయకులకు ఈడీ నోటీసులిచ్చింది. కోటి రూపాయల చందా ఇచ్చినందుకు అయిదుగురు నేతలకు నోటీసులిచ్చారు. వారిని భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని చూస్తున్నారు. బీజేపీకి చందాలు ఇచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులిచ్చారా అని ప్ర‌శ్నించారు. ఆరేడేళ్లలో బీజేపీకి 4,841 కోట్ల రూపాయలు చందాలు వచ్చాయి. అధికారంలో ఉన్నారనే వారికి చందాలు ఇచ్చిన వారికి నోటీసులు ఇవ్వలేదని దుయ్య‌బ‌ట్టారు.

కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్న బీజేపీ.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అని అడిగారు. కేసీఆర్ అవినీతిపై వివరాలతో సహా నేను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. బంగారు కూలీ పేరుతో కోట్ల రూపాయలు టీఆర్ఎస్ వసూలు చేసిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశానని గుర్తుచేశారు. స్పష్టమైన నివేదిక ఇస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీనే ఉండదు.. తొడుక్కోవడానికి అంగీలు లేని కార్యకర్తలున్న టీఆర్ఎస్ కు 8వందల కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయని ప్ర‌శ్నించారు.

ఢీల్లీలో అత్యంత విలువైన ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు స్థలం కేటాయించారు. కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ముందస్తు ఒప్పందంలో భాగమే కేసీఆర్ కు ఢీల్లీలో స్థలం ఇచ్చారు. ఇన్ని ఫిర్యాదులు చేసినా.. టీఆర్ఎస్ నేతలకు ఒక్క నోటీసు ఇవ్వడం లేదు. ఈడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంద‌ని ఫైర్ అయ్యారు.

ఫిరాయింపుల కమిటీలో కీలక నేత కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు వస్తాయని ముందే చెప్పడం వెనక మతలబు ఏమిటీ? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ లో చేరాలనుకున్న వారిని భయపెట్టి బీజేపీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసుల వెనక కుట్రను ప్రజలు గమనించాలి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ ఎందుకు విచారణ జరపడం లేదు? అని ప్ర‌శ్నించారు. ఈడీ, ఇన్ కం టాక్స్, సీబీఐ లు మా మనోధైర్యం దెబ్బతీయలేవ‌ని.. తెలంగాణలో కాంగ్రెస్ మనుగడలో ఉంటే కష్టమనే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని అన్నారు. ఒక పార్టీ ఎదగాలంటే.. ఇంతలా దిగజారాలా? అని ప్ర‌శ్నించారు. గతంలో జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ గెలిచినా పైసా మార్పు రాలేదు. మునుగోడు ప్రజలారా మీ ఆడబిడ్డకు ఒక ఛాన్స్ ఇవ్వండి. తెలంగాణలో గుణాత్మక మార్పు తీసుకొస్తామ‌ని అన్నారు. 11 రాష్ట్రాల్లో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారని విమ‌ర్శించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేసినా.. వారందరినీ సమానంగానే గౌరవిస్తాం అని స్ప‌ష్టం చేశారు. అనుకోని కార్య‌క్రమాలు ఉండటం వల్లే శశిథరూర్ ను కలవలేకపోయిన‌ట్లు వివ‌ర‌ణ ఇచ్చారు.


Next Story