కేటీఆర్ బీజేపీకి కట్టు బానిసలా పని చేస్తున్నారు.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు.
By Medi Samrat
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారని ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు, మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోదీకి దాసోహమయ్యారని.. మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు.
సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మీరు.. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా కేటీఆర్ అని ప్రశ్నించారు. పదేళ్లలో మోదీ తీసుకున్న అనాలోచన నిర్ణయాలన్నింటికీ మద్దతిచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్ను ప్రశ్నించడం హాస్యాస్పదం అన్నారు. కవితని లిక్కర్ స్కాం నుంచి కాపాడడానికి బీజేపీ కి ఊడిగం చేసిది నిజం కాదా? అని ప్రశ్నించారు.
బీజేపీకి కట్టు బానిసలా కేటీఆర్ పని చేస్తున్నారన్నారు. బీజేపీపై బిఆర్ఎస్ ప్రేమతోనే హెచ్సీయూపై రెండు పార్టీల నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సంఖ్యా బలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తోందన్నారు. లోకల్ బాడి ఎన్నికలో బీజేపీని గెలిపించేందుకే కేటీఆర్ తాపత్రయం అన్నారు. పదిహేను నెలల స్పల్ప కాలంలో రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగాలివ్వడం, రైతు, మహిళా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, బీసీలకు 42 రిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ చేయడం, పేదలకు సన్న బియ్యం అందించడం వంటి గొప్ప పనులను రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనం అని విమర్శించారు.