పరీక్షల రద్దు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి

TPCC Leader Revanth Reddy Slams Telangana Government. నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  19 March 2023 9:25 AM GMT
పరీక్షల రద్దు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి

నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధారిలో ఆయ‌న మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలతో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది.. ఈ తప్పిదాలకు ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారని అన్నారు. కేటీఆర్ తనకేం సంబంధం అని అతి తెలివిగా ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ను బర్తరఫ్ చేయడమే కాదు.. చంచల్ గూడ జైలుకు పంపించాల‌ని అన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని వివరాలు ఎందుకు సేకరించలేదు? అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

కస్టడీలోకి తీసుకున్న వారిని విచారించక ముందే ఇద్దరు నేరానికి పాల్పడ్డారని కేటీఆర్ ఎలా నిర్దారిస్తారు? కేటీఆర్ ఏమైనా విచారణ అధికారా? అని ప్ర‌శ్నించారు. టీఎస్ పీఎస్సీ లో పనిచేసే వారు పోటీ పరీక్షలు రాయడానికి అర్హత లేదు.. కానీ ప్రభుత్వం పరీక్షలు రాసుకోవడానికి ఎన్ఓసీ ఇచ్చింది.. నిబంధనలకు విరుద్ధంగా 20 మందికి పైగా పోటీ పరీక్షలు రాశారని అన్నారు. మాధురి అమెరికా నుంచి వచ్చి గ్రూప్1 రాస్తే మొదటి ర్యాంక్ వచ్చింది. జూనియర్ అసిస్టెంట్ రజినీకాంత్ రెడ్డికి 4వ ర్యాంక్ వచ్చింది. కేటీఆర్ కు షాడో మంత్రి పీఏ తిరుపతి.. తిరుపతి, ఏ2 ముద్దాయి రాజశేఖర్ రెడ్డి ది పక్క పక్క గ్రామాలే.. రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం, ప్రమోషన్ ఇప్పించింది పీఏ తిరుపతి.. ఇందులో ప్రత్యక్షంగా కేటీఆర్ కు ప్రమేయం ఉందని ఆరోపించారు.

మాల్యాల మండలంలో గ్రూప్ 1 పరీక్షల్లో వంద మందికి పైగా 103 పైగా మార్కులు వచ్చాయి. వారి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి ఉద్యోగం, ప్రమోషన్ వివరాలు కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మీ పాత్ర ఉందో లేదో విచారణ చేపట్టాలన్నారు. ఈ విషయం కేటీఆర్ కు తెలుసా.. లేదా? శ్రీ లక్ష్మీ, ప్రవీణ్, వెంకటాద్రి శ్రీదేవి, రమేష్, వాసు, మధులత లకు నిబంధనలకు వ్యతిరేకంగా పరీక్షలకు అనుమతి ఇచ్చారా? లేదా? అనుమతి ఇస్తే.. అనుమతించిన వ్యక్తుల పేర్లు ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఒక మంత్రి పేషీలో మంత్రికి తెలియకుండా ఇదంతా జరగదని అన్నారు. మంత్రి కేటీఆర్ కార్యాలయమే అన్ని వ్యవహారాలను చక్కదిద్దిందని ఆరోపించారు. ఈ ఆరోపణల నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోలేరని అన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంత తీవ్రమైన సమస్యపై సీఎం స్పందించి నిరుద్యోగులకు భరోసా ఎందుకు ఇవ్వలేదు. నిరుద్యోగుల పట్ల సీఎంకు ఇంత బాధ్యతారాహిత్యమా? అని ప్ర‌శ్నించారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల, ఏఆర్ శ్రీనివాస్ కు ఉన్న బంధమేంటి? అని మీడియా ముఖంగా అడిగారు.

రాష్ట్ర ప్రభుత్వం సిట్ కు అప్పగించిన ఏ కేసు ముందుకు సాగలేదు. పేపర్ లీకేజీ కేసును సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు.. అక్కడ కేసీఆర్.. ఇక్కడ కేటీఆర్ పాత్రదారులని ఆరోప‌ణ‌లు గుప్పించారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో రేపు వాదనలు వినిపిస్తాం. 21న గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసి.. తక్షణమే వారిని ప్రాసిక్యూట్ చేయాలని కోరతామ‌ని కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టించారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని రేవంత్ రెడ్డి భ‌రోసా ఇచ్చారు.


Next Story