బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి : రేవంత్

TPCC Leader Revanth Reddy On Budget. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  1 Feb 2023 12:24 PM GMT
బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి : రేవంత్

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందని విమ‌ర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికి బడ్జెట్ లో నిధులేవి అని ప్ర‌శ్నించారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు లేవు.పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ, పట్టింపు లేదు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడిందని ఆరోపించారు. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు దోషులే అని విమ‌ర్శించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు.. తెలంగాణకు అన్యాయం చేశారని అన్నారు.

ఇప్పటికైనా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం కేటాయించాలని కోరారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మోదీగారు మీరు గుజరాత్ కు సీఎం కాదు.. ఈ దేశానికి ప్రధాని. నిధుల కేటాయింపులో గుజరాత్ కు కల్పించిన ప్రాధాన్యతను తెలంగాణకు కల్పించండని కోరారు. మోదీ అన్యాయం చేస్తుంటే.. నిలదీయాల్సిన బీఆర్ఎస్.. సభలో నిస్సహాయంగా నిలబడిందని విమ‌ర్శించారు. అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే.. కేసీఆర్ కేంద్రంతో కాళ్లబేరానికి దిగాడని ఆరోపించారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు.

ఫిబ్రవరి 6 న తెలంగాణలో ములుగు సమ్మక్క-సారక్క జాతర నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. జాతీయ స్థాయి నాయకత్వం కూడా వివిధ సందర్భాలలో పాల్గొంటుందని పేర్కొన్నారు. మొదటి విడతగా 60 రోజులు.. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో చేయాలనుకుంటున్నామ‌ని.. ఆ తరువాత కొనసాగించే విషయం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు.


Next Story