కాంగ్రెస్‌ను ఓడించే శక్తి ఆ మోడీకి, ఈ కేడీకి లేదు

TPCC Leader Revanth Reddy Fire On Modi And KCR. టీఆరెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై చార్జిషీట్ ను విడుదల చేసిన‌ట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

By Medi Samrat  Published on  3 Sep 2022 9:23 AM GMT
కాంగ్రెస్‌ను ఓడించే శక్తి ఆ మోడీకి, ఈ కేడీకి లేదు

టీఆరెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై చార్జిషీట్ ను విడుదల చేసిన‌ట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశానికి హాజరైన ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, నిర్వాసితుల ఆత్మహత్యలకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేన‌ని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి.. కేవలం ఉప ఎన్నికలపైనే టీఆరెస్, బీజేపీ లు దృష్టి పెట్టాయని విమ‌ర్శించారు. గొర్ల మందపై తోడేళ్ళలా, మిడతల దండులా మునుగోడు ప్రజలపై దాడి చేయడానికి టీఆరెస్, బీజేపీ లు వస్తున్నాయని విమ‌ర్శించారు. మునుగోడు ప్రజలు, ఇక్కడి యువత చైతన్యవంతులని పేర్కొన్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 వరకు వజ్రోత్సవాలు జరపాలని కాంగ్రెస్ పక్షాన పిలుపునిచ్చారు. మన పోరాట చరిత్రను దేశానికి చాటాల్సిన అవసరం ఉందని.. వజ్రోత్సవాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కేంద్రం 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఊరూరా వజ్రోత్సవాలు చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ను విమర్శించిన కేసీఆర్.. ఎనిమిదేళ్లుగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదు. మీరు ఎవరికి లొంగిపోయారు.. ఎవరి ముందు వంగిపోయారని ప్ర‌శ్నించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనందుకు కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఒకరిది 41 అయితే ఒకరిది 21.. కానీ కాంగ్రెస్ ది 140 ఏండ్ల చరిత్ర. తెలంగాణ సమాజాన్ని నిజాం నుంచి విముక్తి కలిగించింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రేస్ పార్టీది. చెప్పుకోవడానికి చరిత్ర లేనోళ్లు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమ‌ర్శించారు. మనం పార్టీ ఫిరాయింపు దారుల పక్షాన ఉన్నామా.. ఎవరి పక్షాన ఉన్నామో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మునుగొడులో కాంగ్రెస్ ఓటుబ్యాంకు 97 వేల ఓట్లు. మనం కలిసికట్టుగా ఉండి ఓటు బ్యాంకును కాపాడుకుంటే కాంగ్రెస్ గెలుపు ఖాయం. రోజుకో రెండు గంటలు ఇంటింటికి తిరిగితే లక్ష ఓట్లు సాధిస్తామ‌ని అన్నారు.

మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించే శక్తి ఆ మోడీకి లేదు.. ఈ కేడీకి లేదని విమ‌ర్శించారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సర్వం అండగా నిలిస్తే.. ఇప్పుడు మోడీకి 22వేల కోట్లకు అమ్ముడుపోయాడని విమ‌ర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అమ్ముడు పోయే సన్నాసులకు నిధులు వచ్చాయి తప్ప.. నియోజక వర్గంలో ఏ గ్రామనికైనా నిధులొచ్చాయా? అని ప్ర‌శ్నించారు. ప్రజల తీర్పును కుదువపెట్టిన వారికే ఇవాళ నిధులు వచ్చాయి తప్ప ఎవరికీ ఒరిగిందేమీ లేదని అన్నారు.

కమ్యూనిస్టులను చూస్తే జాలేస్తుంది. మిమ్మల్ని కొనుక్కుపోయి మీ పార్టీని బొందపెట్టిన టీఆర్ఎస్ కు మీరు మద్దతు ఇస్తారా అని ప్ర‌శ్నించారు. నాయకులు ఎక్కడికైనా పోనీ.. మునుగోడు కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండని కోరారు. విలీన దినోత్సవం పేరుతో మత కల్లోలం సృష్టించాలని బీజేపీ కుట్ర చేస్తోంది.. ప్రజల్లో చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోంది.. ఒక్క ఓటుతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పండని ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చారు.


Next Story