హైదరాబాద్ గాంధీభవన్లో ఈ నెల 10వ తేదీ నుంచి టీపీసీసీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు అందుబాటులో ప్రజా ప్రతినిధులు ఉండేలా కార్యక్రమాలను ప్లాన్ చేసింది. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను ప్రభుత్వం చేత పరిష్కరించే విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతి రోజు ఇద్దరు ప్రజా ప్రతినిధులు గాంధీ భవన్ లో అందుబాటులో ఉండేలా కార్యక్రమం రూపొందించారు.
జూన్ 10వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటారు. వీరు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి వాటిని ప్రభుత్వం చేత పరిష్కరించేలా కృషి చేయనున్నట్లు టీపీసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొదట రోజుకు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు గాంధీ భవన్ లో అందుబాటులో ఉండనుండగా ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతి రోజు ఇద్దరు చొప్పున గాంధీ భవన్ లో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.