హైదరాబాద్: సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగరంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి సుమారు 450 మంది వైద్య సిబ్బందిని ఇక్కడికి డిప్యూటేషన్పై పంపారు. ఇందులో మూడవ వంతు డాక్టర్లు కాగా, మిగిలిన వారు నర్సులు, పారామెడికల్ సిబ్బంది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ప్రధాన ఆసుపత్రుల నుంచి నిపుణులను తాత్కాలికంగా ఇక్కడ నియమించారు.
శాశ్వత నియామకాలు జరిగే వరకు, అంటే సుమారు రెండు నెలల పాటు ఈ తాత్కాలిక ఏర్పాటు కొనసాగుతుంది. సనత్నగర్ టిమ్స్కు మెడికల్ కాలేజీ అనుబంధంగా లేకపోవడం వల్ల రోగుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో నెలల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను ఇక్కడికి మళ్లించి చికిత్స అందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం నిమ్స్ తరహాలో స్వయంప్రతిపత్తితో పనిచేసేలా ఈ సంస్థను తీర్చిదిద్దుతున్నారు. శాశ్వత పోస్టుల మంజూరు ఫైల్ ముఖ్యమంత్రి వద్ద పెండింగ్లో ఉందని, అనుమతి రాగానే పూర్తిస్థాయి రిక్రూట్మెంట్ చేపడతామని అధికారులు తెలిపారు.