ఆధునికయుగంలోనూ చాలా మంది మూఢనమ్మకాలను వీడటం లేదు. మోసపోయేవాళ్లు ఉన్నన్ని రోజులు.. మోసం చేసేవాళ్లు ఉంటారు. తాజాగా ఓ ముగ్గురు బురిడీ బాబాలు నకిలీ స్వాముల వేషాలు వేసి.. ప్రజలను మోసం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆరోగ్య సమస్యలు, సంతానం, ఉద్యోగం రావడం ఇలా అన్ని సమస్యలు తమ చేతిలో పని అని, తాము పూజలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన పర్వతం స్వామి అలియాస్ నాగరాజు స్వామి, సిరసాల బక్కయ్య, పర్వతం సైదులు అలియాస్ సహదేవ స్వామి అవతారమెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు.
''మేం మంత్రాలు చదివితే అన్ని రోగాలు మటుమాయం, మీ ఇంట్లో గుప్త నిధులు తీస్తాం, మేం ఇచ్చే నిమ్మకాయలోని రసం తాగితే సంతానం కలుగుతుంది' అంటూ మండలంలోని అన్నెబోయిన్పల్లి, అందుగుల, కలకొండ పరిసర ప్రాంతాల్లో ప్రజలు మాయమాటలు చెబుతున్నారు. నమ్మిన వారి నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజల ద్వారా తెలుసుకున్న పోలీసులు వారి బురిడీని బోల్తా కొట్టించారు. బురిడీ బాబాలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుండి రూ.13 లక్షలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.