హైదరాబాద్: నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
స్మార్ట్ వాచ్, సెల్ఫోన్లు, ఇతర గాడ్జెట్స్ వంటివి పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షా కేంద్రాల్లో తలెత్తే సమస్యలు, విద్యార్ధుల విజ్ఞప్తుల స్వకరణకు జిల్లా, రాష్ట్రస్థాయిలో 24 గంటలూ పని చేసే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే 040-23230942 నంబర్కి కాల్ చేసి అడగవచ్చు అని కూడా చెప్పారు. పరీక్షల విధుల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28,100 మంది ఇన్విజిలేటర్లు, 2,650 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2,650 మంది శాఖ అధికారులను నియమించారు.