రైతులకు గుడ్‌న్యూస్..రేపే అకౌంట్లలోకి డబ్బులు

తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

By Knakam Karthik
Published on : 15 Jun 2025 7:32 AM IST

Telangana, Farmers, Congress Government, Raithu Bharosa

రైతులకు గుడ్‌న్యూస్..రేపే అకౌంట్లలోకి డబ్బులు

తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతు భరోసా డబ్బులపై కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. రేపు రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అందుకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష, మంత్రిమండలి సమావేశాల్లో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చర్చించారు. ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదించగా, నిధుల విడుదలకు ఆయన ఆమోదించినట్లు తెలుస్తోంది.

అయితే బాండ్ల విక్రయం ద్వారా గత మంగళవారం రూ.3000 కోట్లు ఖజానాకు జమ అయ్యాయి. తాజాగా మరో రూ.4000 కోట్ల విలువైన బాండ్లను కూడా జారీ చేశారు. వచ్చే మంగళవారం బాండ్ల వేలం తర్వాత ఆ మొత్తం కూడా ఖజానాకు చేరుతుంది. ఆ మొత్తాలతో రైతు భరోసాకు నిధుల సర్దుబాటు చేయనున్నారు. దీంతో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది.

కాగా ఈ నెల 16న మంత్రులతో సీఎం రేవంత్ సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అదే రోజు సీఎం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి రైతు నేస్తం కార్యక్రమం కింద వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రతి మంగళవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రైతు నేస్తం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌​ను నిర్వహించనున్నారు.

Next Story