ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెంచే లక్ష్యంగా నేటి నుంచి బడి బాట
శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రారంభంకానుంది.
By Knakam Karthik
ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెంచే లక్ష్యంగా నేటి నుంచి బడి బాట
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రారంభంకానుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 6 నుంచి 19 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి, విద్యార్థులను బడిలో చేర్పించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు టీచర్లు బాలకార్మికులను, బడి బయట పిల్లలను, అనాథలను, అంగన్వాడీ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రీప్రైమరీ స్కూల్స్, నోట్బుక్స్ పంపిణీ, తదితర కొత్త ప్రణాళికలతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తోంది.
షెడ్యూల్ ప్రకారం తొలిరోజు బడి ఉన్న ప్రతి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో గ్రామసభనిర్వహిస్తారు. 7న ఉపాధ్యాయులు ప్రతి ఇంటిని సందర్శించి, బడి ఈడు పిల్లలను గుర్తించాల్సి ఉంటుంది. 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున 10వ తేదీ నాటికి బడులను శుభ్రం చేసి సిద్ధం చేస్తారు. ఆరోజు పాఠశాలలను అలంకరించి, ముగ్గులు వేసి... పండగ వాతావరణంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు, గ్రామస్థులకు స్వాగతం పలుకుతారు. పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం) సైతం నిర్వహించాల్సి ఉంటుంది. 'బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి తలపెట్టిన బడిబాటలో ఉపాధ్యాయులంతా పాల్గొనాలి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా కలిసికట్టుగా కృషి చేద్దాం' అని టీఆర్డీఎఫ్ కోరింది. రాష్ట్రవ్యాప్తంగా 26,106 ప్రభుత్వ, పంచాయlతీరాజ్ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం 16.86 లక్షల మంది విద్యార్థులున్నారు.