బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కాంగ్రెస్ నాయకుడు కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ను బయటకు రావాలని సవాల్ విసిరే స్థాయి కడియంకు లేదని, కేసీఆర్ను చూస్తేనే ఆయనకు భయం పట్టుకుంటుందని ఎద్దేవా చేశారు.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును వరప్రదాయిని అని పొగిడి, ఈరోజు 'కూలేశ్వరం' అనడానికి నోరెలా వస్తుందని ప్రశ్నించారు. 2009, 2011 ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన కడియంకు కేసీఆర్ ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కాసులకు అమ్ముడుపోయి తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారిన వ్యక్తి కేసీఆర్ను విమర్శించడం సిగ్గుచేటని రాజయ్య మండిపడ్డారు.