డీజీపీ ఎదుట‌ లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు వరసగా లొంగిపోతున్నారు.

By -  Medi Samrat
Published on : 28 Oct 2025 6:06 PM IST

డీజీపీ ఎదుట‌ లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు వరసగా లొంగిపోతున్నారు. తాజాగా ఆ లిస్టులో మరికొంతమంది మావోయిస్టు అగ్రనేతలు చేరారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మంగళవారం లొంగిపోయారు. డీజీపీ ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న, చంద్రన్న, మావోయిస్టు రాష్ట్ర కమిటీ మెంబర్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు. పుల్లూరి ప్రసాద్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది. బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్‌పై కూడా రూ.20 లక్షల రివార్డు ఉంది.

మావోయిస్టులు చంద్రన్న, బండి ప్రకాశ్ అజ్ఞాతం వీడారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పిలుపు మేరకు.. మావోయిస్టులు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిశారని పేర్కొన్నారు. పుల్లూరి ప్రసాద్ రావుది పెద్దపల్లి జిల్లా అని తెలిపారు. చంద్రన్న15 ఏళ్లు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారని గుర్తుచేశారు. చంద్రన్న మొదట రాడికల్ స్టూడెంట్‌‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని వెల్లడించారు డీజీపీ శివధర్ రెడ్డి.

1980లో కిషన్‌జీకి కొరియర్‌గా చంద్రన్న పనిచేశారని గుర్తుచేశారు. 2008లోనే కేంద్ర కమిటీ మెంబర్‌గా చంద్రన్న ఉన్నారని తెలిపారు. 2024 డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా ఆయన ఉన్నారని వివరించారు. అక్టోబరు 21వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చంద్రన్న జన జీవన స్రవంతిలో కలిశారని చెప్పుకొచ్చారు. చంద్రన్న ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో అజ్ఞాతం వీడారని పేర్కొన్నారు డీజీపీ శివధర్ రెడ్డి.

Next Story