హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదల నివాసాలనే కాకుండా, పెద్దలవి కూడా కూల్చాలని ఘాటుగా స్పందించింది. పెద్దల భవనాలు కూల్చినప్పుడే సర్కారు భూములను రక్షించినట్లు అవుతుందని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కేవలం పేదల నిర్మాణాలను కూల్చితే ప్రయోజనం లేదని పేర్కొంది.
మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహశీల్దార్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ మంచి విషయమే అయినప్పటికీ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తెలిపింది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగిన చర్యలను తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.