హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోంది. మొదటి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు. ఈ వారంలో మెజార్టీ లబ్ధిదారులు మొదలుపెట్టనున్నారు. బేస్మెంట్ పూర్తి చేసిన వారి ఖాతాల్లో ఈ నెల 15వ తేదీ నాటికి రూ.లక్ష చొప్పున జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.715 కోట్లు సిద్ధం చేస్తోంది. లబ్ధిదారులకు దశల వారీగా రూ.5 లక్షలు ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
బేస్మెంట్ లెవల్లో రూ.లక్ష, గోడలు నిర్మించాక రూ.1.25 లక్షలు, స్లాబ్ తర్వాత రూ.1.75 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక రూ. లక్ష ప్రభుత్వం అందజేయనుంది. ఇటీవలే నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నెల 28 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం వారోత్సవాలను ప్రారంభించింది. ఇంటి నిర్మాణానికి కనీసం 60 గజాల స్థలం ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇందిరమ్మ ఇంటిలో పడకగది, వంటగది, హాల్, స్నానాల గది, టాయిలెట్ ఉంటుంది. ఈ నమూనాతో లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది.