రైతులకు తీపికబురు.. పంట నష్ట పరిహారం నిధులు విడుదల
పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik
రైతులకు తీపికబురు..పంటనష్టం పరిహారం నిధులు విడుదల
తెలంగాణలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వాన, అకాలవర్షాలకు పంట నష్టం సంభవించగా సీఎం రేవంత్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు రైతు వారీ పంటనష్టం అంచనవేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగింది. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన 51.528 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల అకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఏకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, ప్రత్తి 4753 ఎకరాలలు మరియు ఇతర పంటలు 477 ఎకరాలలో (ప్రాణహిత వరదల మూలంగా సంభందించిన నష్టం) పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే మే నెలలో జరిగిన పంటనష్టానికి సంభందించి నివేదిక కూడా సిద్దంచేసి ఈ వారమే పంపగా, వాటికి సంబంధించిన నిధులు మంజూరు కావల్సి ఉన్నదని మంత్రి తెలియజేశారు.