గుడ్న్యూస్..అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు
రాష్ట్రంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik
గుడ్న్యూస్..అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు
రాష్ట్రంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న రైతు భరోసా డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి నేడు విడుదల చేశారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి ప్రోగ్రాంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ఉక్కు సంకల్పాన్ని తీసుకున్నామని తెలిపారు.
ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే రైతులు ఇబ్బందులు పడకూడదని రైతు భరోసా నిధులు ఇస్తున్నామని సభా వేదికగా ప్రకటించారు. రానున్న 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను 70,11,984 మంది రైతుల అకౌంట్లలో నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి అన్నదాతలకు నిధులు జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అంతకుముందు కేబినెట్ సమావేశంలో మాట్లాడిన సీఎం..సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ముఖ్యమంత్రి చర్చించారు. జిల్లా నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.