సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం..ఏపీ సీఎంకు రేవంత్ విజ్ఞప్తి

నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు..అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

By -  Knakam Karthik
Published on : 9 Jan 2026 4:21 PM IST

Telangana, Cm Revanthreddy, Water Dispute, Andrapradesh, AP CM Chandrababu

సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం..ఏపీ సీఎంకు రేవంత్ విజ్ఞప్తి

హైదరాబాద్: నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు..అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల e-సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నీళ్లే కావాలని నేను కోరుకుంటా..అని సీఎం అన్నారు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం. ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా..అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు అడ్డంకులు పెట్టవద్దని సీఎం రేవంత్ కోరారు. ఈ అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వం నిధులు రావడంలేదన్నారు. దీంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందని సీఎం అన్నారు. మేం వివాదం కోరుకోవడం లేదు, పరిష్కారం కోరుకుంటున్నాం, రాజకీయ ప్రయోజనాలు కాదు, ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం..అని సీఎం తెలియజేశారు.

తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయి. పక్క రాష్ట్రాలతో మేం వివాదాలు కోరుకోవడంలేదు. అది ఏపీ అయినా,కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా పరస్పర సహకారమే కోరుకుంటున్నాం..అని సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు.

Next Story