దక్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ‌ కుట్ర‌ను తిప్పికొడ‌తాం : సీఎం రేవంత్‌

సరైన విధానాలు లేకుండా లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పునరుద్ఘటించారు

By Medi Samrat
Published on : 13 March 2025 4:14 PM IST

దక్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ‌ కుట్ర‌ను తిప్పికొడ‌తాం : సీఎం రేవంత్‌

సరైన విధానాలు లేకుండా లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పునరుద్ఘటించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా తలపెట్టిన డీలిమిటేషన్ ఎత్తుగడకు వ్యతిరేకంగా అవసరమైతే జాతీయ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.

త‌మిళ‌నాడు మంత్రి కేఎన్ నెహ్రూ ఆధ్వ‌ర్యంలో, ఎంపీలు కనిమొళి, ఎ.రాజా ఇతర నేతలతో కూడిన డీఎంకే ప్ర‌తినిధి బృందం ముఖ్య‌మంత్రిని ఢిల్లీలో కలిసి, ఈ నెల 22న త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ చెన్నైలో నిర్వహిస్తున్న సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం అందజేశారు.

భేటీ అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. "పార్లమెంట్ నియోజక‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో దక్షిణాది సహా ఇతర రాష్ట్రాలకు వాటిల్లే న‌ష్టంపై చర్చించడంతో పాటు కేంద్రం కుట్రలను నిలువరించేలా తదుపరి కార్యాచరణ తీసుకోడానికి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు తమిళనాడు సీఎంను అభినందిస్తున్నాను. మా పార్టీ హైకమాండ్ అనుమతి తీసుకొని ఈనెల 22న చెన్నై వేదికగా జరగబోయే సమావేశానికి హాజరువుతాను అని పేర్కొన్నారు.

దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఎంతో ఉన్నప్పటికీ, కేవలం తమకు రాజకీయంగా పట్టు చిక్కడం లేదనే అక్కసుతో బీజేపీ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలను లిమిట్ చేయాలని భావిస్తోంది. ఈ కుట్రలను కచ్చితంగా తిప్పికొట్టి, దేశ సమైక్యతను, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకుంటాం. అందుకోసం అవసరమైతే జాతీయ స్థాయిలో ఆందోళన చేపడతామ‌న్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ డీలిమిటేషన్ అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి సారధ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలతో పాటు పౌర సమాజం ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకొని కేంద్రానికి నివేదిస్తాం. ప్రతిఒక్కరు రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం ఇది." అని ముఖ్యమంత్రి అన్నారు.

Next Story