ఆరోజున సోనియా గాంధీని సత్కరించనున్న తెలంగాణ కేబినెట్

జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోనియాగాంధీని ఆహ్వానించి సత్కరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది

By Medi Samrat  Published on  21 May 2024 4:15 AM GMT
ఆరోజున సోనియా గాంధీని సత్కరించనున్న తెలంగాణ కేబినెట్

జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోనియాగాంధీని ఆహ్వానించి సత్కరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ మేరకు సోమవారం కేబినెట్ తీర్మానం చేసి, భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) లేఖ కూడా రాసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతిని కోరింది తెలంగాణ కేబినెట్.

సోమవారం నాలుగు గంటలపాటు జరిగిన కేబినెట్‌ సమావేశం అనంతరం దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. సన్న ధాన్యం వరి క్వింటాల్‌కు బోనస్‌గా రూ.500, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో పాటు ఇవ్వాలని కూడా మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. ఈ బోనస్‌ను అందించే సన్న ధాన్యం రకాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) శాస్త్రవేత్తలు త్వరలో ప్రకటిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను ఆధునీకరించాలని నిర్ణయించామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. పాఠశాల ఆధునీకరణకు సుమారు రూ.600 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై తన అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

Next Story