హైదరాబాద్: అక్రమ మైనింగ్పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తోందన్న హరీశ్ రావు వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ససేమిరా అన్న హరీశ్ దీనిపై చర్చించేందుకు హౌస్ కమిటీ వేయాలన్నారు. అందుకు స్పీకర్ అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ వెల్లోకి వచ్చి నిరసనకు దిగింది.
ఎమ్మెల్యే హరీశ్ రావు బయటపెట్టిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై ప్రభుత్వం భయపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్పై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందేనని, ప్రభుత్వం దిగిరాకపోతే గవర్నర్ను కలుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పోడియం వైపు వెళ్లేందుకు యత్నించడంతో మార్షల్స్ అడ్డుకున్నారు.
అటు అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాళేశ్వరంపై విచారణను ముందుకు సాగనీయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందని మోదీ చెప్పారని, కానీ విచారణను సీబీఐకి అప్పగిస్తే చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీశ్ రావు తమ్ముడు మహేశ్ రావు వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారని, దీనిపై హౌస్ కమిటీ వేస్తామని సీఎం తెలిపారు.