తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 5 తదుపరి విచారణకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు 2025 మే 2న తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ రావు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను విచారిస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక ప్రభాకర్ రావు భారతదేశానికి తిరిగి రావడానికి వీలుగా ఆయన పాస్పోర్ట్, ప్రయాణ పత్రాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ పాస్పోర్ట్ అధికారిని కోరింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు తన పత్రాలను అందుకున్న మూడు రోజుల్లోపు దర్యాప్తు అధికారి ముందు హాజరై తన సమ్మతిని తెలియజేస్తూ అఫిడవిట్ సమర్పించాలి. తదుపరి విచారణ తేదీ నాటికి దర్యాప్తు పురోగతిపై వివరణాత్మక నివేదికను దాఖలు చేయాలని దర్యాప్తు అధికారిని కోర్టు ఆదేశించింది.