తెలంగాణ ప్రభుత్వ వినతిపై స్పందించి హైదరాబాద్కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రకటించిన కేంద్రమంత్రి కుమార స్వామికి రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద హైదరాబాద్ కి రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈవీ పాలసీ తీసుకొచ్చిందని పొన్నం అన్నారు. 100 శాతం టాక్స్ మినహాయింపు చేస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో ఓఆర్ఆర్ లోపల నడిచే ఆర్టీసీ బస్సులను పూర్తిగా 2800 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి గతంలో కేంద్ర మంత్రి కుమార స్వామి ని కలిసి ఎలక్ట్రిక్ బస్సులకు సహకరించాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్ నగరానికి ప్రధాన మంత్రి ఈ డ్రైవ్ పథకం కింద రెండు వేల బస్సులు కేటాయిస్తామని తెలపడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన 800 ఎలక్ట్రిక్ బస్సులు కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.