హైదరాబాద్‌ ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌లో కాలుష్య నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik
Published on : 7 Jun 2025 11:35 AM IST

Telangana, Hyderabad News, Congress Government, Electric Auto Rickshaws

హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌లో కాలుష్య నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో జనాభా పెరుగుదల దృష్ట్యా పర్యావరణ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్ లేని 65 వేల కొత్త త్రీ వీలర్ ఆటో రిక్షాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నగరంలో కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. దీంతో ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 263 విడుదల చేసింది.

హైదరాబాద్‌ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, ఓఆర్‌ఆర్ లోపల ఏర్పడిన కొత్త లే అవుట్లు, అపార్ట్‌మెంట్ల ఫలితంగా పట్టణీకరణపై వివిధ సవాళ్లు తలెత్తాయి. ముఖ్యంగా నగరంలో జనాభా అపారమైన పెరుగుదల కారణంగా ఆటో రిక్షా పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ వాహనాలకు సంబంధించిన ఆటోలకు రేటిరోఫిట్మెంట్‌ చేసి వాటి ఇంజిన్‌ను ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ లాగా మార్చుకోవడానికి 25 వేల వాహనాలకు అనుమతి ఇచ్చింది. కాగా ఇప్పటివరకు ఉన్న డీజిల్, పెట్రోల్ ఆటో రిక్షాల ట్రాన్స్‌ఫర్, డీజిల్, పెట్రోల్‌తో నడిచే కొత్త ఆటో రిక్షాలకు ఓఆర్‌ఆర్ పరిధిలో అనుమతించబడవు అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో వైపు ఓఆర్‌ఆర్ లోపల కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 10 వేల కొత్త ఎల్పీజీ, 10 వేల కొత్త సీఎన్‌జీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story