తెలంగాణలో మళ్లీ స్వల్ప భూకంపం.. మళ్లీ ఆ జిల్లాల్లోనే..

Small earthquake in northern telangana. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలోని

By అంజి  Published on  1 Nov 2021 1:52 AM GMT
తెలంగాణలో మళ్లీ స్వల్ప భూకంపం.. మళ్లీ ఆ జిల్లాల్లోనే..

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. ఆదివారం రాత్రి 6.48 గంటలకు భూమి కంపించడంతో.. ఇళ్లలో ఉన్న వారు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, గొల్లపల్లి, కొడిమ్యాల, మెట్‌పల్లి మండలాల్లో పలు గ్రామాలతో పాటు పెద్దపల్లి జిల్లాలోని గోదావరఖని, రామగుండం, పాలకుర్తి, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారం, రామగిరి మండలాల్లోని గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చాయి. లక్షెట్టిపేట, శ్రీరాంపూర్‌, ఆసిఫాబాద్‌, మల్హార్‌ మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఉప్లూరు, కుమ్రంభీం జిల్లా కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్‌, బెజ్జూరు మండలాల్లో భూమి కంపించింది.

ఉత్తర తెలంగాణల గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో.. అక్కడి భూమి పొరలు సర్దుబాట్ల సమయంలో అప్పుడప్పుడూ భూప్రకంపనలు వస్తాయని ఎన్‌జీఆర్‌ఐలోని భూకంప అధ్యయన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ముప్పిడి రవికుమార్‌ తెలిపారు.

Small earthquake in northern telanganaఇటీవల కూడా రామ‌గుండం, మంచిర్యాల‌, క‌రీనంగ‌ర్ ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు దీశారు. మంచిర్యాలోని చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతా రాంపూర్ తదితర‌ ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4గా నమోదైంది.

Next Story