సిద్ధిపేట బాలికకు అరుదైన అవకాశం.. న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో..
Siddipet girl performs at Republic Day celebrations in New Delhi. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సిద్దిపేటకు చెందిన
By Medi Samrat Published on 26 Jan 2022 2:11 PM GMT
బుధవారం న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సిద్దిపేటకు చెందిన ఓ బాలికకు అరుదైన అవకాశం లభించింది. నిత్య వరలక్ష్మి రెడ్డి అనే బాలిక గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తన నాట్యంతో అలరించింది. నిత్య వరలక్ష్మి రెడ్డి స్వస్థలం మద్దూరు మండలం సాలకపురం గ్రామం. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నిత్య, ప్రముఖ భరతనాట్య గురువు మంజుల రామస్వామి శిష్యురాలు. హైదరాబాద్లోని లోతుకుంటలోని శ్రీరామ నాటక నికేతన్లో మంజుల రామస్వామి వద్ద శిక్షణ తీసుకుంటోంది. దేశం నలుమూలల నుండి వచ్చిన శాస్త్రీయ నృత్యకారులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవకాశం ఇస్తారు. మంజుల రామ స్వామికి చెందిన 10 మంది శిష్యులు దేశం నలుమూలల నుండి వచ్చిన 19 ఇతర బృందాలతో పాటు నృత్య ప్రదర్శన కోసం ఎంపికయ్యారు.
తెలంగాణ నుంచి మంజుల రామస్వామి టీమ్కే అరుదైన అవకాశం దక్కింది. నిత్య తల్లి మంజులారెడ్డి వర్గల్ మండలం తుంకిఖాల్సా గ్రామంలో టీచర్గా పనిచేస్తుండగా, ఆమె తండ్రి నరసింహారెడ్డి మర్కూక్లో వీఆర్వోగా పనిచేస్తున్నారు. నిత్యా నాలుగేళ్ల నుంచి క్లాసికల్ డ్యాన్సర్గా శిక్షణ తీసుకుంటోందని, ఆ క్రెడిట్ మొత్తం ఆమె టీచర్ మంజుల రామస్వామికే దక్కుతుందని నిత్య తల్లి మంజులారెడ్డి తెలిపింది. వారి బృందం జనవరి 6 నుంచి న్యూఢిల్లీలో ఉంటున్నారు. పది మంది సభ్యుల బృందంలో మహేశ్వరి జగబత్తుల, శృతి శ్రీకుమార్, జీఎస్ విద్యా నందిని, కె నిత్య వరలక్ష్మి రెడ్డి, కామిశెట్టి హిమాన్షిత, గరిక తన్మయి, మేఘనా బొర్రా, అనుష్క సారా మాథ్యూ, తేజేస్విని చక్రవర్తి, జాహ్నవి దంతులూరి ఉన్నారు.