తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతులకు పెట్టుబడి సాయం 'రైతు భరోసా'పై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల చెప్పారు. మూడు ఎకరాల వరకు ఉన్న రైతులందరి అకౌంట్లలో ఎకరానికి రూ.6 వేలు చొప్పున మొత్తం రూ.1551.89 కోట్లు నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఈ నిధులను నేరుగా రైతుల అకౌంట్లలోనే జమ చేసినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు లబ్ధి చేకూరింది. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
నిన్న(జూన్ 16) 44.25 లక్షల మంది రైతులకు రూ.2,349 కోట్లు జమ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 9 రోజుల్లో అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయాలని వ్యవసాయ శాఖ ప్రణాళికతో ముందుకెళుతోంది. రైతు భరోసా నిధుల జమ చేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రోఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.