గ్యాంగ్స్టర్ నయీం.. క్రైమ్ సామ్రాజ్యానికి కేరాఫ్ అడ్రెస్. నాలుగేళ్ల కిందట పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అయితే నయీం చనిపోయాక ఎన్నో విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా కూడా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. గ్యాంగ్స్టర్ నయీం స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) దరఖాస్తు చేశారు. ఉత్తరమండలం ఐజీ నాగిరెడ్డి ఇచ్చిన సమాధానాన్ని విస్తుపోయేలా చేస్తోంది.
మూడు ఏకే 47 రైఫిళ్లు, 9 పిస్టళ్లు, మూడు రివాల్వర్లు, 7 తపంచాలు, 12 బోర్ గన్, స్టెన్గన్ చెరోటి, తూటాలు 616, ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, 21 కార్లు, 26 ద్విచక్ర వాహనాలు, 602 సెల్ఫోన్లతోపాటు రూ.2.16 కోట్ల నగదు, 2,482 కిలోల వెండి, సుమారు రెండు కిలోల బంగారం, 752 భూ దస్తావేజులు, 130 డైరీలు, పేలుడు పదార్థాలైన 5 కిలోల అమ్మోనియం నైట్రేట్, రెండు హ్యాండ్ గ్రనేడ్లు, జిలెటిన్ స్టిక్స్ 10, ఫ్యూజ్వైర్ 10 మీటర్లు, మేగజైన్స్ ఆరు, ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 30.. స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.
వందల సంఖ్యలో భూదస్తావేజులు నయీం వద్ద లభించిందని తెలుస్తోంది. గ్యాంగ్స్టర్ డైరీలు, మొబైళ్ల డేటాను విశ్లేషిస్తే పోలీసు అధికారులతో అతడికి ఉన్న సంబంధాలు బయటకొస్తాయని అంటున్నారు. అయితే గ్యాంగ్స్టర్ నయీం కేసు మాత్రం ముందుకు కదలడం లేదు.