తెలంగాణ‌ను దేశంలో నెంబర్-1 తాగుబోతుల అడ్డాగా మార్చారు : రేవంత్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజ‌య‌భేరి యాత్ర‌లో భాగంగా నర్సాపూర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు.

By Medi Samrat  Published on  20 Nov 2023 10:22 AM GMT
తెలంగాణ‌ను దేశంలో నెంబర్-1 తాగుబోతుల అడ్డాగా మార్చారు : రేవంత్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజ‌య‌భేరి యాత్ర‌లో భాగంగా నర్సాపూర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌భ‌కు త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జానీకానికి అభినందనలు తెలియ‌జేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. నాయకులు పదవుల కోసం అమ్ముడుపోయినా.. కార్యకర్తలు పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చారని.. పార్టీ ఫిరాయించిన ఒక నమ్మకద్రోహికి బీఆర్ఎస్ ఇక్కడి టికెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుంద‌న్నారు.

నర్సాపూర్ లాంబాడి సోదరుల అడ్డా.. లాంబాడాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. అధికారంలోకి రాగానే నర్సాపుర్ పరిధిలోని లంబాడా తండాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ దన్నారు. బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్.. బొందలగడ్డ తెలంగాణగా మార్చారని మండిప‌డ్డారు. మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ నెంబర్ 1 అని చెప్తుండు.. రైతుల ఆత్మహత్యల్లో నెంబర్-1.. నిరుద్యోగ సమస్యల్లో నెంబర్ వన్.. దేశంలోనే నెంబర్ 1 తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చారని విమ‌ర్శించారు. అమ్ముడుపోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దని సిలుపునిచ్చారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అని కేసీఆర్ అంటుండు.. ఇందిరమ్మ రాజ్యం అంటే మా లాంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ... ఇందిరమ్మ రాజ్యం.. తండాల్లో.. మారుమూల పల్లెల్లో పేదలకు నిలువ నీడనిచ్చి.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం. భూమి ఆత్మగౌరవం.. 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచిన రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం. దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసింది ఇందిరమ్మ రాజ్యం.. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం.. సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయానికి సాగునీరు అందించిన రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించిన రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే.. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం అడక్కు తినేదని కౌంట‌రిచ్చారు.

కేసీఆర్ .. సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్‌గా నీకు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం.. కాంగ్రెస్ కాదా.? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్.. ఆనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిన్ను నియమించిన సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అనే సంగతి మరిచిపోయావా.? అని ప్ర‌శ్నించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కేసీఆర్ ను వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలన్నారు. తెలంగాణలో అరాచకం రాజ్యమేలుతోంది.. రాచరిక పాలన సాగుతోందని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక కేసీఆర్ పాలనకు కాలం చెల్లింది.. ఆయన్ను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చేసిందన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించండి.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాది అని రేవంత్ వ్యాఖ్యానించారు.

Next Story