హుజురాబాద్ ఉపఎన్నిక : లోపాయికారి ఒప్పందాలు.. చీకటి రాజకీయాలు బయటపెట్టండి
Revanth Reddy Zoom Meeting On Huzurabad Bypoll. హుజురాబాద్ ఎన్నికలలో ఇంటికో ఓటు కాంగ్రెస్కు వేయండి అనే నినాదాన్ని ఇంటింటికి
By Medi Samrat Published on 21 Oct 2021 11:08 AM GMT
హుజురాబాద్ ఎన్నికలలో ఇంటికో ఓటు కాంగ్రెస్కు వేయండి అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జీలు, సమన్వయకర్తలతో జరిగిన జూమ్ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత, విద్యార్థులను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం ఉండాలని సూచించారు. వచ్చే వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలను నాయకులతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడికి, విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకెళ్లాలని తెలిపారు.
ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కు ఓటు ఎందుకు వేయాలి. బీజేపీ, టిఆర్ఎస్ ల మోసపూరిత విధానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, చేసిన నష్టాలను వివరించాలని పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నికలకు కారణం ఏమిటి.. ఎవరు.. దళిత బంధును అడ్డుకున్నదెవరు.. ఇచ్చిన మాటలు అమలు చేయకుండా ప్రజలను వంచించింది ఎవరు అనేది.. ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని ఆదేశించారు. బీజేపీ, టిఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలు.. చీకటి రాజకీయాలు బయటపెట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉండేలా ప్రచార వ్యూహాలను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ మీటింగ్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే.. ఈ నెల 23, 24, 26 తేదీలలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజక వర్గంలో ప్రచారం చేయనున్నారు.