బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. పార్టీని నిలబెట్టేనా..
Revanth Reddy Taking Oath As PCC President. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ
By Medi Samrat Published on 7 July 2021 9:06 AM GMT
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి తదితర సీనియర్ నేతలు రేవంత్ బాధ్యతల స్వీకారానికి హాజరయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన టీపీసీసీ పగ్గాలను అందుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. రేవంత్ రెడ్డి నియామకాన్ని విమర్శించినా నేతలూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రేవంత్ పదవీ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద కోలాహలం నెలకొంది. మరికొద్ది సేపట్లో నిర్వహించనున్న బహిరంగ సభలో రేవంత్ మాట్లాడనున్నారు.
ఇప్పటికే గాంధీభవన్ లో రేవంత్ కు అనుగుణంగా వాస్తు మార్పులను చేశారు. సీఎల్పీ నేత భట్టి చాంబర్, ఇంతకుముందు పీసీసీ చీఫ్ చాంబర్ కు పక్కనే ఉన్న మీటింగ్ హాల్ ను కలిపి రేవంత్ చాంబర్ గా మార్చారు. ఇంతకు ముందు ఉత్తమ్ మూసేయించిన గేట్ నూ తెరిచి రెండు గేట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో రేవంత్ పూజలు చేసి, అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి నాంపల్లిలోని యూసుఫైన్ దర్గా చేరుకున్నారు. అక్కడ చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. ఆయన వెంట భారీగా నేతలు, కార్యకర్తలు వెళ్లారు.