అభ్యర్థులను ప్రకటించేంత వరకూ సంయమనం పాటించండి : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేంత వరకూ మీడియా సంయమనం పాటించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు

By Medi Samrat  Published on  10 Oct 2023 2:30 PM GMT
అభ్యర్థులను ప్రకటించేంత వరకూ సంయమనం పాటించండి : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేంత వరకూ మీడియా సంయమనం పాటించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉంద‌ని.. నిర్ణయాలు జరిగితే మీడియాకు వెల్లడిస్తాం అని స్ప‌ష్టం చేశారు. సీట్ల విషయంలో సమర్థులైన నాయకులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. వారి వారి హోదాలు, గౌరవం తగ్గకుండా సమన్వయం చేసేందుకు కేసీ వేణుగోపాల్ కమిటీని నియమించారన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కమిటీ సభ్యులకు ఇంచార్జ్ ఠాక్రే, దీపాదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ , జానారెడ్డి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు.

కొందరు అధికారులు బీఆర్ఎస్ కు కొమ్ముకాస్తున్నారని.. అలాంటి అధికారులపై పీఏసీ సమావేశంలో చర్చించామ‌న్నారు. నిబంధనలు ఉల్లంఘించి కొందరు అధికారులు నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు. పెన్షన్ తప్ప మిగతా వాటికి ఎన్నికలయ్యేవరకూ ఎలాంటి నిధులు విడుదల చేయొద్దని అన్నారు. చట్టంలో లొసుగులు వాడుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు.

బీఆర్ఎస్ కు కొమ్ముకాసే పోలీస్, ఐఏఎస్, రెవెన్యూ, అన్ని విభాగాల అధికారుల వివరాలను కాంగ్రెస్ సేకరిస్తోందన్నారు. మేం నియమించిన ప్రత్యేక కమిటీ ఆ వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీల సొంత మీడియా కాంగ్రెస్ పై అపోహలు సృష్టిస్తోందని ఆరోపించారు. తప్పుడు వార్తలు వేసే మీడియా యజమాన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. తప్పుడు వార్తలు వేసి కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోద‌న్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఆరు నెలల ముందు వేసిన అన్ని టెండర్లపై అధికారంలోకి రాగానే సమీక్షిస్తామ‌న్నారు. భూముల అమ్మకాలనూ సమీక్షిస్తామ‌ని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగానే ప్రభుత్వం పని చేయాలన్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి బీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చే అధికారులందరిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

హైదరాబాద్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రకటనలకు అవకాశం ఇవ్వాలని మెట్రో హైదరాబాద్ ను కోరారు. బస్సు యాత్రపై రెండు రకాల సూచనలు వచ్చాయి. అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్రకు వెళ్లాలా.. లేక బస్సు యాత్ర మధ్యలో అభ్యర్థులను ప్రకటించాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామ‌న్నారు. జాతీయ నాయకత్వం సూచన మేరకు బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. నర మాంసానికి అలవాటు పడ్డ కుటుంబం పులులతో పోల్చుకుంటోందన్నారు. తండ్రిని జంతువుతో కేటీఆర్ కరెక్ట్ గా పోల్చారన్నారు.

Next Story